కొయ్యూరు: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పూర్తి వివరాలు సేకరించాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ ఆదేశించారు. ఆదివారం కొయ్యూరు ,మంప పోలీసుస్టేషన్లను చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తే దాని ఆధారంగా భద్రత కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. మండలంలో మారుమూల పంచాయతీలైన ఎం.భీమవరం, యూ.చీడిపాలెం, బూదరాళ్ల పంచాయతీల్లో సమస్యలపై ఆయన స్పందించి పలు సూచనలు చేశారు. సారా తయారీ నిరోధంపై దృష్టి సారించాలని సూచించారు.
కమ్యూనిటీ పోలీసింగ్తో మరింత చేరువ
గిరిజనులకు మరింత చేరువ అయ్యేందుకు వీలుగా కమ్యూనిటీ పోలీసింగ్ను విస్తరించాలని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ఆదేశించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. నిర్దేశించిన చోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆపరేషన్ పరివర్తన్ను విస్తరించి నిత్యం గంజాయిపై నిఘా ఉంచాలన్నారు. కొయ్యూరు మండలంలో గంజాయి సాగు లేకపోయినా తరలిపోతున్న గంజాయిపై దృష్టిసారించాలని సూచించారు. గంజాయి తరలించే వారిపై కఠిన చర్యల తీసుకోవాలని ఆదేశించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీఐ స్వామినాయుడు, ఎస్ఐలు రాజారావు, లోకేష్కుమార్ పాల్గొన్నారు.