రాజవొమ్మంగి: స్థానిక శ్రీఅల్లూరి సీతారామరాజు జెడ్పీ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి ముదునూరి సూర్యనారాయణరాజు (1976–77) ఆదివారం అల్లూరి సీతారామరాజు 7.5 అడుగుల ఎత్తయిన భారీ కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. భారీ వాహనంలో తీసుకువచ్చి పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేశారు. వచ్చేనెల 16వ తేదీన జరగనున్న పాఠశాల స్వర్ణోత్సవాల నేపథ్యంలో బహూకరించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆరోజు ఉదయం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులు, వ్యాపారంలోని స్నేహితులు ఇచ్చిన మొత్తానికి కొంత నగదు జోడించి రూ.8 లక్షలతో ఈ విగ్రహాన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత మేలు చేయాలన్న తపనతో ఈ విగ్రహాన్ని ఇచ్చానన్నారు. తాను నిర్మాణ రంగంలో హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ తమ కుటుంబానికి ఈప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయనను పూర్వ విద్యార్థులు శివరామచంద్రరాజు, అప్పారావు, సీతారామరాజు, శ్రీనివాస జీవన్, కృష్ణవర్మ, సూరిబాబు, శివాజిరాజు, బషీరా, నీలవేణి అభినందించారు.
పాఠశాలకు సమకూర్చిన పూర్వ విద్యార్థి ముదునూరి సూర్యనారాయణరాజు
పలువురి అభినందన