చింతూరు: మధ్యాహ్న భోజన పథకం, వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ పట్ల జరిగే తప్పులకు సంబంధిత ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించి ఐటీడీఏకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు రోల్మోడల్ ఉంటూ పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. జగనన్న విద్యాకానుక అందుకున్న విద్యార్థులకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును యాప్లో సమయపాలన ప్రకారం నమోదు చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని పీవో తెలిపారు. పదో తరగతి ఫలితాలు వందశాతం సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలకు సంబంధించిన సమాచారం స్పష్టంగా ఉండాలని సూచించారు. నాడు–నేడు నిధులు, నిర్వహణ నిధులు సక్రమంగా వినియోగించాలని పీవో ఆదేశించారు. విద్యార్థులందరికీ హెచ్బీ రక్తపరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కంచర్ల సుజాత, ఎంఈవోలు లక్ష్మీనారాయణ, బాలరాజు, సీఎంవో సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవో కావూరి చైతన్య