రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
రాజవొమ్మంగి: ప్రతి కుటుంబం సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని కోరుకొనే వైఎస్సార్సీపీకే రానున్న ఎన్నికల్లో పట్టం కట్టండి అంటూ రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. మండలంలోని చెరకుంపాలెం, సంజీవనగరం, ఉర్లాకులపాడు, బోర్నగూడెం, అమీనాబాద్కాలనీ, వెలగలపాలెం, చిన్నయ్యపాలెం గ్రామాల్లో ఆమె గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దేశానికే ఆదర్శం..జగనన్న పాలన
గత టీడీపీ ప్రభుత్వ పాలకలు ప్రజలను ఎంతో మోసం చేశారన్నారు. స్వచ్ఛభారత్ పథకం కింద మండలంలో ప్రతి కుటుంబానికి మంజూరైన మరుగుదొడ్లకు చెందిన కోట్లాది రూపాయల నిధులను దిగమింగారన్నారు. నేడు సీఎం జగనన్న పాలనలో ప్రజల చెంతకే ప్రభుత్వ పాలన వచ్చిందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో సచివాలయం, వెల్నెస్ భవనాలు, రైతు భరోసా భవనాలు రూపుదిద్దుకోవడంతో గ్రామాల ముఖచిత్రం నభూతో నఃభవిష్యతి అన్నట్టుగా మెరుగుపడిందన్నారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ ఘనత మన జగనన్నదేనన్నారు. డిజిటలైజేషన్ ద్వారా సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకోవడాన్ని మన సీఎం ఎంతో సులభతరం చేశారన్నారు. ఊహకందని ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. విద్యుత్ లేని గ్రామాలకు విద్యుత్, ఇంటింటికీ కుళాయి, సీసీరోడ్లు వంటి అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత మనకే దక్కుతుందన్నారు. రైతు భరోసా ద్వారా సాగు పెట్టుబడిసాయం, ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీ జరిగిందన్నారు. విద్యకు పెద్ద పీట వేస్తున్న మన సీఎం జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, నాడు–నేడు పథకాల ద్వారా కోట్లాది రూపాయలతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను గ్రామస్తులకు ఆమె పంచిపెట్టారు. సంక్షేమం, అభివృద్ధి మన ప్రభుత్వానికి రెండు కళ్లు అని, మరోసారి ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థినిగా నేను అంటే నాగులపల్లి ధనలక్ష్మి, అరకు ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న డాక్టర్ తనూజరాణిలను గెలిపించాలని అభ్యర్థించారు.
మండల పార్టీ అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంటేష్రాజు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్లు కొంగర మురళీకృష్ణ, తొంటా ఆదిరాజు, దాసరి నాగేశ్వరరావు, కించు వెంకటలక్ష్మి, ఆగూరి శుభలక్ష్మి, భీంరెడ్డి శుభలక్ష్మి, సవిరెల చంద్రుడు, ఎంపీటీసీ సభ్యులు నిర్మలాదేవి, గంగదుర్గ, నాయకులు కుశరాజు, దుర్గాప్రసాద్, వీరబాబు, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.