చింతూరు: గుర్తు తెలియని ముగ్గురు మహిళలు సినీఫక్కీలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన చింతూరులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వీరు బంగారు ఆభరణాల కొనుగోలు కోసమంటూ స్థానిక మెయిన్రోడ్లో నీలిమా జ్యూయలర్స్ షాపునకు వచ్చారు. అక్కడ బంగారు ఆభరణాలు చూస్తున్నట్లుగా నటిస్తూ రెండు జతల చెవిదిద్దులు చాకచక్యంగా కాజేశారు. అనంతరం చోరీ చేసిన ఆభరణాల స్థానంలో షాపు యజమానికి అనుమానం రాకుండా చిన్నసైజులో నకిలీ ఆభరణాలు ఉంచి ఏమీ కొనకుండా అక్కడి నుంచి ఉడాయించారు. వారు వెళ్లిన పిదప షాపు యజమానికి అనుమానం వచ్చి నకిలీ ఆభరణాలు పరిశీలించగా రూ.50 వేల విలువచేసే రెండు జతల చెవిదిద్దులు మాయమైనట్లు గుర్తించారు. అనంతరం షాపులో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ముగ్గురు మహిళలు చోరీ చేసిన వైనం బయటపడింది. ఈ ఘటనపై షాపు యజమాని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.