గ్రానైట్‌ క్వారీలను నడిపింది మీ ఎమ్మెల్యేనే.. | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ క్వారీలను నడిపింది మీ ఎమ్మెల్యేనే..

Published Tue, Jun 20 2023 12:34 PM

సమస్యలేమైనా ఉన్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్న ధర్మశ్రీ   - Sakshi

అనకాపల్లి: గ్రానైట్‌ క్వారీలకు తాను మొదటి నుంచి వ్యతిరేకినని, గతంలో టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా వాటిని నడిపేవారని ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మైదాన గిరిజన గ్రామాలను ఐటీడీఏలో చేర్చడం మంచిదేనని, అది తన పరిధిలో లేని అంశమన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చీమలపాడు గ్రామానికి విచ్చేసిన ఆయన కారు వద్దకు టీడీపీ గ్రామ నాయకులు గోర సంజీవ్‌, వెంకటరమణ, బొండా దేముడు, జనసేన కార్యకర్త కొత్తెం అప్పారావు వెళ్లారు. తమ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏలో చేర్చాలని, కల్యాణపులోవ ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దని నినాదాలు చేయగా ధర్మశ్రీ పై విధంగా స్పందించారు.

ఏమైనా సమస్యలున్నాయా...
అనంతరం గిరిజన గ్రామాలైన కల్యాణపులోవ, ములకలాపల్లి, చీమలపాడులో సోమవారం ధర్మశ్రీ ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైనా బిల్లులు రాలేదని కల్యాణపులోవలో బొండా రమణమ్మ తదితరులు వాపోయారు.

గువ్వమ్మ, రాజమ్మలకు ఇళ్ల స్థలాలు, సెగ్గె చిన్ని, రాజులమ్మలకు ఇళ్లు మంజూరు చేస్తామని ధర్మశ్రీ హామీ ఇచ్చారు. ములకలాపల్లిలో రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీటీసీ చిన్ని చినమ్మలు కోరగా రూ.10 లక్షల టీటీడీ నిధులతో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పైల రాజు, తహసీల్దార్‌ మహేశ్వరరావు, ఎంపీడీవో వెంకన్నబాబు, కొత్తకోట సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహమ్మద్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గుమ్ముడు సత్యదేవ, సర్పంచ్‌ ఒంజరి గంగరాజు, మండల సచివాలయ కన్వీనర్‌ కంచిపాటి జగన్నాథరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement