పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం... | Sakshi
Sakshi News home page

పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం...

Published Sat, Jun 24 2023 12:28 PM

- - Sakshi

అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఓటమి చెందడానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లే కారణమంటూ బస్సు యాత్రలో టీడీపీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించడం పట్ల జనసేన పార్టీ సీనియర్‌ నాయకుడు, కాపునేత గెడ్డం బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుంటపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వయంకృతాపరాధాలే టీడీపీ ఓటమికి కారణమన్నారు.

2009లో చిరంజీవి వల్ల, 2019లో పవన్‌కల్యాణ్‌ కల్యాణ్‌ వల్ల పాయకరావుపేటలో టీడీపీ ఓడిపోయిందని బండారు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. 2014లో జనసేన పార్టీ మద్దతు వల్లే పాయకరావు పేట నియోజకవర్గంలో వంగల పూడి అనిత ఎమ్మెల్యేగా గెలుపొందారన్నా రు. గెలిచిన నెలరోజులకే జనసేన నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తనపై కేసులు పెట్టారన్నారు.

2014లో జనసేన మద్దతు ఇవ్వకపోతే పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి అనిత ఘోరంగా ఓటమి పాలయ్యేవారన్నారు. 2024 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మళ్లీ గెలుపొందాలని వంగలపూడి అనిత ప్రయత్నిస్తున్నారని, ఆమె పాయకరావుపేటలో ఎలా గెలుస్తారో తాము చూస్తామన్నారు. ఆమె ఓటమే మా ధ్యేయమని చెప్పారు.అనితకు టికెట్‌ ఇస్తే పాయకరావుపేటలో ఓడిపోవడం ఖాయమని ఈ విషయాన్ని బండారు తోపాటు, టీడీపీ పెద్దలు గ్రహించాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement