తంతడి బీచ్‌లో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

తంతడి బీచ్‌లో విద్యార్థి మృతి

Published Tue, Nov 14 2023 1:28 AM

-

దీపావళి రోజున అప్పన్నపాలెంలో విషాదం

అచ్యుతాపురం(అనకాపల్లి):అందరికీ వెలుగుల్ని పంచే దీపావళి ఆ కుటుంబానికి మాత్రం చీకట్లను మిగిల్చింది. బాగా చదువుకుని తమ బతుకుల్ని బాగుచేస్తాడనుకున్న పెద్ద కుమారుడు అలల రక్కసికి బలవడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. అచ్యుతాపురం మండలంలోని అప్పన్నపాలేనికి చెందిన రెడ్డి లోకేష్‌(19) మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎంతో చురుగ్గా ఉండే లోకేష్‌ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి నూకరాజు ఆటో డ్రైవర్‌గా, తల్లి అచ్యుతాపురంలో పాన్‌షాప్‌ నిర్వహిస్తూ ఇద్దరు కుమారుల్ని చదివిస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడైన లోకేష్‌తో పాటు అతని తమ్ముడు, మరో 8 మంది స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం తంతడి బీచ్‌కు వెళ్లారు. వీరు స్నానం చేస్తుండగా లోకేష్‌, అతని సోదరుడ్ని కెరటాలు లాక్కెళ్లాయి. అక్కడే ఉన్న కొందరు స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. లోకేష్‌ సోదరుడు క్షేమంగానే బయటపడ్డాడు. లోకేష్‌ మాత్రం కెరటాల తాకిడికి నీరు కడుపులోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ సంఘటన కుటుంబ సభ్యలతోపాటు, అప్పన్నపాలెం వాసులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement