● గిరిజన సంక్షేమానికి ప్రభుత్వాల పెద్దపీట ● బిర్సా ముండా పోరాట పటిమ అందరికీ ఆదర్శం ● అరకులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీకారం
సాక్షి,పాడేరు/అరకులోయటౌన్: గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఇందుకోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అరకులోయలో బుధవారం గవర్నర్ వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించారు. ముందుగా భగవాన్ బిర్సాముండాతో పాటు ఇతర గిరిజన పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన గిరిజన సదస్సును జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో కొద్ది సమయం ప్రసంగించారు. ఆహూతులను తెలుగులో సంబోధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు ప్రచార రథాల ద్వారా వికసిత్ భారత్ సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దే వైద్య సేవలందించడంతో అందించడంతో ప్రజలకు సత్వర వైద్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మంజూరు చేసిన దారకొండ అంబులెన్స్, మూడు ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు. ఐదు గిరిజన ఉప తెగల భాషలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పోడు భూములకు పట్టాలు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లను గవర్నర్ పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ గిరిజన సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి పాల్గొన్నారు.