విశాఖ స్పోర్ట్స్: టీ–20 సిరీస్లో భాగంగా భారత్తో ఆస్ట్రేలియా తలపడే తొలి మ్యాచ్కు విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్టేడియంలో మంగళవారం నిర్వాహక కమిటీ సమావేశమైంది. కమిటీ అధ్యక్షుడు, కలెక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మళ్లింపు కోసం డీఎస్పీ స్థాయి అధికారులను నియమించామన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్రెడ్డి మాట్లాడుతూ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. స్టేడియంలో కొన్ని గ్యాలరీల్లో కుర్చీలను మార్పు చేసి అభిమానులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్పొరేట్ గ్యాలరీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది.. ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ మాట్లాడుతూ స్టేడియంలో పారిశుధ్యం నిర్వహణ, ఫుడ్స్టాళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఆరు అంబులెన్స్లను అందుబాటులో ఉంచామన్నారు. మ్యాచ్ నిర్వాహక కమిటీ, వీడీసీఏ ప్రతినిధులతో పాటు సీఈవో శివారెడ్డి పాల్గొన్నారు.