యలమంచిలి: భారతదేశం సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని ఆస్ట్రేలియన్ యువతి జార్జిమోర్ అన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం, దాని లక్ష్యాల ప్రచారంలో భాగంగా పూరీ నుంచి రామేశ్వరం వరకు పాదయాత్ర చేస్తున్న ఆమె శుక్రవారం యలమంచిలి పట్టణంలోని వేద పాఠశాలను, గోశాలను సందర్శించారు. వేద పాఠశాలలో విద్యార్థులతో కలసి వేదపఠనం చేశారు. మన ప్రాచీన వేదాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఆచార సంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అద్వైతం, వేదాలపై మక్కువ పెంచుకుని, దేశమంతటా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాల గురించి తెలుసుకోవడం ఈ దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఇక్కడి వేదపండితుల ఆశీర్వచనం పొందడం చాలా ఆనందంగా ఉందని, తను చేస్తున్న పాదయాత్రకు భగవంతుడు గొప్ప శక్తిని ప్రసాదించాడన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు సన్యాసిబాబు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కట్టా సత్యనారాయణ, పడాల శ్రీరాములు, సమరసత ఫౌండేషన్ సభ్యుడు సత్యనారాయణ, వేదపాఠశాల సెక్రటరీ పెద్దింటి సూర్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి
ఆస్ట్రేలియా యువతి జార్జి మోర్
యలమంచిలి వేద పాఠశాలలో పఠనం
భారతదేశంలో పూరీ నుంచి రామేశ్వరానికి పాదయాత్ర