బుచ్చెయ్యపేట: తుపాను కారణంగా జిల్లాలో 140 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ఆర్అండ్బి ఎస్ఈ క్రాంతిమతి తెలిపారు. వడ్డాదిలో పెద్దేరు నీటిలో మునిగిన డైవర్షన్ రోడ్డు, దెబ్బతిన్న వంతెనను ఆమె అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 38 కల్వర్టులు, 10 రోడ్డు మార్జిన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.8 కోట్లు, శాశ్వత నిర్మాణ పనులకు రూ.77.39 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల్లో మరమ్మతు పనులు చేపట్టామని, ప్రయాణికుల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
యుద్ధప్రాతిపదికన డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు
భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో రాకపోకలు సాగేలా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పిస్తామని, యుద్ధప్రాతిపదికన డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని ఆర్అండ్బీ ఎస్ఈ క్రాంతిమతి తెలిపారు. పాదచారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తక్షణం మరమ్మతులు చేపట్టి శనివారం నుంచే వంతెనపై నుంచి రాకపోకలు సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. డైవర్షన్ రోడ్డు ఖానాల్లో ఇరుక్కుపోయిన చెట్లు, తుప్పలను జేసీబీతో ఎస్ఐ కుమారస్వామి, ఆర్అండ్బీ డీఈ నాగ మనోహరరావు, జేఈ సాయి శ్రీనివాసులు,ఈవో లవరాజులు దగ్గరుండి తీయించారు. దీంతో వరద నీరు ఖానాల్లో నుంచి వెళ్లడంతో మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.
● ఆర్అండ్బి ఎస్ఈ క్రాంతిమతి