అనకాపల్లి టౌన్/మునగపాక: తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అనారోగ్య పరిస్థితులు నెలకొనకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డీఎంహెచ్వో డాక్టర్ హేమంత్ అనకాపల్లి మండలంలో తగరంపూడి పీహెచ్సీని శుక్రవారం సందర్శించారు. పీహెచ్సీలో అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
అకాల వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశముందని, జ్వర పీడితులకు మంచి వైద్యం అందించాలన్నారు. ఓపీ, ల్యాబ్, మందులు నిల్వ చేసిన గదిని పరిశీలించారు. జిల్లా మలేరియా అధికారి కె.వరహాల దొర మునగపాక మండలం నాగులాపల్లిలో పర్యటించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. సీహెచ్వో దేవకాంత, ఆరోగ్య పర్యవేక్షకులు ఎం.ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.