అనంతపురం అర్బన్: పాలనా సౌలభ్యం కోసం అనంతపురం మండలం రెండుగా విభజన అయ్యింది. అర్బన్, రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీఓ 206ని సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు అనంతపురం మండలం నగరంతో కలిసి ఉంది. అర్బన్ పరిధిలో ఐదు లక్షల జనాభా, రెండు లక్షల జనాభా రూరల్ పరిధిలో ఉంది. జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయాన్ని అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురాన్ని రెండు మండలాలుగా విభజించాలని విన్నవించారు. సీఎం సానుకూల నిర్ణయంతో అర్బన్, రూరల్ మండలాలుగా ఏర్పడ్డాయి. ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే అనంత ధన్యవాదాలు తెలిపారు. అర్బన్, రూరల్ మండలాలకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటుతో పాలన సులువు కానుందన్నారు.
● అనంతపురం అర్బన్ మండల పరిధిలోకి నగర పాలక సంస్థ (74 వార్డు సచివాలయాలతో కూడిన 28 రెవెన్యూ వార్డులు), ఎ.నారాయణపురం, అనంతపురం గ్రామం, కక్కలపల్లిలో భాగమైన రుద్రంపేట పంచాయతీ, పాపంపేట కొంత భాగం వస్తాయి.
● అనంతపురం రూరల్ మండల పరిధిలోకి కొడిమి, తాటిచర్ల, సోములదొడ్డి, రాచానపల్లి, సజ్జలకాలవ, కురుగుంట, గొల్లపల్లి, కామారుపల్లి, ఆలమూరు, కాటిగానికాలవ, కక్కలపల్లి, పాపంపేట కొంత భాగం, ఉప్పరపల్లి, ఇటికలపల్లి, జంగాలపల్లి, కందుకూరు, చియ్యేడు, మన్నీల, కక్కలపల్లి గ్రామం, కక్కలపల్లి కాలనీ వస్తాయి.
అనంతపురం మండలం రెండుగా విభజన
అర్బన్ మండలం, రూరల్ మండలం ఏర్పాటు
గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం