అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రజారవాణా శాఖ ఆధ్వర్యంలోని ఆర్టీసీ ద్వారా చేపట్టిన పార్సిల్ (కార్గో) సేవలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అత్యఽధిక ఆదాయం అర్జించిన వాటిలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా నాల్గో స్థానంలో నిలవగా... రాయలసీమ జిల్లాలోనే నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించింది. దీనిపై జిల్లా ప్రజారవాణాధికారి సుమంత.ఆర్.ఆదోని హర్షం వ్యక్తం చేశారు. తొలుత జిల్లా కేంద్రానికే పరిమితమైన కార్గో సేవలను అనంతరం ఏడు డిపోలకు అధికారులు విస్తరించారు. వీటి ద్వారా మొత్తం 17 మండలాల్లో కార్గో ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన సేవలు అందుతుండడంతో ఈ మూడేళ్లలో కార్గో సేవలపై ప్రజల ఆదరణ పెరిగింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.7.23 కోట్ల ఆదాయం రాగా, గత ఆర్థిక సంవత్సరం 2022–23లో ఏకంగా రూ. 9.03 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో రూ.79.59 లక్షల ఆదాయం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత సత్వర, నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాకు ముందే సంప్రదిస్తే వారి ఇళ్ల వద్దకే కార్గో సిబ్బంది వెళ్లి పార్సిల్ తీసుకుంటున్నారు. సకాలంలో గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా ఇంటి వద్దకే సరుకు అందజేస్తున్నారు.
రాయలసీమ జిల్లాల్లో నంబర్ వన్
జిల్లాలో ఆర్టీసీ సరుకు రవాణాకు
పెరుగుతున్న ఆదరణ
డోర్ డెలివరీ కార్యక్రమంతో
సేవలు మరింత విస్తరణ