నిశ్చితార్థం చేశారు.. పెళ్లి మరిచారు | Sakshi
Sakshi News home page

మా అన్న పెళ్లి జరిగేంత వరకు ఆగాలి...

Published Sun, Aug 13 2023 1:42 AM

- - Sakshi

అనంతపురం: వివాహ నిశ్చితార్థం జరిగి ఏడాదైనా పెళ్లి వాయిదా వేస్తుండడంతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు సిద్ధమైంది. విషయాన్ని సకాలంలో గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు...యాడికి మండలం రాయలచెరువు నివాసి నారాయణ మూడో కుమారుడు చరణ్‌కు బళ్లారికి చెందిన మేనత్త కుమార్తె భవితతో ఏడాది క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే తన రెండో కుమారుడి వివాహం తర్వాతనే చరణ్‌కు పెళ్లి చేస్తామంటూ నారాయణ దంపతులు భీష్మించారు.

అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం బళ్లారి నుంచి తల్లితో పాటు అనిత రాయలచెరువుకు వచ్చి పెళ్లి చేసుకుందామని చరణ్‌ను అడిగింది. అన్న పెళ్లి జరిగేంత వరకూ ఆగాలని, లేకుంటే వచ్చే మాఘమాసంలో వివాహం చేసుకుందామని చరణ్‌ తెలిపాడు. దీంతో మనస్తాపం చెందిన భవిత... తాడిపత్రి మార్గంలోని రైలు పట్టాలపై చేరుకుని ఆత్మహత్యకు సిద్ధమైంది.

ఒంటరిగా రైలు పట్టాలపై కూర్చొని ఏడుస్తున్న భవితను గమనించిన రైతులు ఆమెను చేరుకుని ఆరా తీశారు. అనంతరం విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి అక్కడకు చేరుకుని అనితను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాయలచెరువులోని చెక్‌పోస్టు వద్ద గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు తలారి నగేష్‌, గ్రామస్తుల సమక్షంలో ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఈ ఏడాది నవంబర్‌లో భవిత, చరణ్‌ వివాహం జరిగేలా నచ్చజెప్పి, అనితను అప్పగించారు.

Advertisement
 
Advertisement