వేర్వేరు ప్రాంతాల్లో జీవితంపై విరక్తితో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య పరిస్థితిని తాళలేక ఇద్దరు, కడుపు నొప్పి తాళలేక ఓ విద్యార్థి, భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
పెద్దపప్పూరు: మండలంలోని తురకపల్లికి చెందిన శ్రీరాములమ్మ (59) ఆత్మహత్య చేసుకుంది. కొన్ని నెలలుగా గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా జబ్బు నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు రామసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శరత్ చంద్ర తెలిపారు.
కంబదూరు: స్థానిక వడ్డే కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకటరమణ దంపతుల కుమారుడు వడ్డే గురుకుమార్(23) డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల కిడ్నీలో రాళ్లు ఉండడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే నొప్పి తీవ్రత భరించలేక సోమవారం ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బత్తలపల్లి: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం తాటిచెర్లకు చెందిన సునీతకు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని పాతూరుకు చెందిన నరసింహులు కుమారుడు చిన్న అక్కులప్ప (27)తో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన చిక్క అక్కులప్ప రోజూ మత్తులో ఇంటికి చేరుకుని భార్యను చితక్కొట్టేవాడు. అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగు చెందిన ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావాలని పదేపదే ప్రాధేయపడినా ఆమె రాకపోవడంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ఫ్యాన్కు విగతజీవిగా వేలాడుతున్న అక్కులప్పను గుర్తించి, ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
కణేకల్లు: మండలంలోని మాల్యం గ్రామానికి చెందిన బోయ లాలుస్వామి (21) ఆత్మహత్య చేసుకున్నాడు. వరికోత యంత్రం ఆపరేటర్గా పనిచేస్తున్న ఆయన కొన్ని నెలలుగా మూర్ఛ, కడుపునొప్పితో బాధపడేవాడు. చికిత్స పొందినా జబ్బు నమయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుని గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.