కళ్యాణదుర్గం: తమ పొలాలకు దారి (రస్తా) ఇవ్వకుండా సర్పంచ్ వేధిస్తున్నాడంటూ ఆర్డీఓ డాక్టర్ రాణి సుష్మితకు కుందుర్పి మండలం తూముకుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓను ఆమె చాంబర్లో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 86–6లోని రైతులు తమ భూమిలోకి వెళ్లేందుకు పూర్వీకుల కాలం నుంచి ఆ గ్రామ ప్రస్తుత సర్పంచ్ (టీడీపీ) రామాంజినేయులు పొలం మీదుగా రస్తా ఉంది. అయితే ఇటీవల రైతులను ఆ మార్గంలో వెళ్లకుండా రామాంజినేయులు అడ్డు వేశాడు.
గతంలోనూ ఇదే తరహాలో అడ్డు కట్ట వేయడంతో విషయాన్ని అప్పటి ఆర్డీఓ నిషాంత్రెడ్డి దృష్టికి తీసుకెళితే పోలీసు రక్షణతో రస్తా ఇప్పించారు. తాజాగా మరోసారి సర్పంచ్ దౌర్జన్యంగా రస్తాకు అడ్డుకట్ట వేయడంతో పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ రామాంజినేయులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. స్పందించిన ఆర్డీఓ రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని హామీనివ్వడంతో రైతులు వెనుదిరిగారు.