గుంతకల్లు రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం వెంకటాంపల్లి నివాసి వెంకటేష్ (57)కు భార్య నాగలక్ష్మి, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. వ్యవసాయంతో పాటు కూలి పనులతో జీవనం సాగించే వెంకటేష్ గురువారం ఉదయం నాగసముద్రం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణమైన ఆయన మరికాసేపట్లో గ్రామానికి చేరుకుంటుండగా డ్రైవర్ వేగ నియంత్రణ కోల్పోవడంతో ఆటో బోల్తాపడింది. ఘటనలో తలకు తీవ్రగాయమైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై గుంతకల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైలు నుంచి జారిపడి.....
తాడిపత్రి టౌన్: మండలంలోని చల్లవారిపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లికి చెందిన మహబూబ్ బాషా (38) మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి మహబూబ్బాషాగా నిర్ధారించుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా, మహబూబ్బాషా వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లలో కూలి పనులు చేసేవాడని, స్వగ్రామానికి రైలులో వస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతుడి భార్య ఆరీఫా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.