అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో శుక్ర, శనివారం ‘ ఆర్ట్ అండ్ కల్చరల్ ఫెస్ట్–2023 నిర్వహిస్తున్నట్లు వీసీ జింకా రంగజనార్దన తెలిపారు. వర్సిటీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు డ్యాన్స్, మిమిక్రీ, పాటలు, ఆటలు, ఫ్యాషన్ షో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరపత్రాలను వీసీ గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ పులివెందుల, కలికిరి, ఎంబీఏ క్యాంపస్ కళాశాల, ఓటీపీఆర్ఐ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వర్సిటీ చరిత్రలో తొలిసారి అని వీసీ పేర్కొన్నారు. కార్యక్రమానికి కోఆర్డినేటర్గా డాక్టర్ జి. మమత, కోకోఆర్డినేటర్గా డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ అరుణను నియమించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి. శశిధర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తల్లో
గ్రామీణులే ఎక్కువ
బాగేపల్లి :ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చినవారేనని ఆ సంస్థ శాస్త్రవేత్త శ్రీనివాస్ అన్నారు. బాగేపల్లి సమీపంలోని శ్రీసత్యసాయి విద్యానికేతన్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు ఉంటాయన్నారు. శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ప్రభుత్వ స్కూళ్లలో చదివినవారే ఉన్నారన్నారు. సైన్స్పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. ఆసక్తి ఉన్న అంశాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు.