అనంతపురం ఎడ్యుకేషన్: మనం ఎలా పనిచేస్తున్నామని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే పనితీరు మెరుగు పడుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ జె.వరప్రసాదరావు అన్నారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనాథ, నిరుపేద ఆడపిల్లలు చదువుకుంటున్న కేజీబీవీల్లో పని చేస్తున్న అందరూ సేవాభావం కలిగి ఉండాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లందరూ రోజూ డ్యూటీలో ఉండాల్సిందేనన్నారు. ఎస్ఎంఎఫ్, నాడు–నేడు నిధులు వేర్వేరుగా ఉంటాయని, ఒకే ఖాతా కావడంతో ఏ నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారనేది పక్కాగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకూ ఎస్ఎంఎఫ్, మన బడి నాడు–నేడు నిధులు ఎన్ని వచ్చాయి... ఎంత ఖర్చు చేశారు... బ్యాలెన్స్ ఎంత ఉందనే వివరాలు గురువారం సాయంత్రంలోపు కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. విద్యార్థినుల నోట్ బుక్స్ కరెక్షన్ చేయడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, సీఆర్టీలందరూ కచ్చితంగా వారివారి సబ్జెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు కరెక్షన్లు చేయాలన్నారు. ఎస్ఓలు కూడా ర్యాండమ్గా పరిశీలించాలన్నారు. ఈ అంశంపై త్వరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఐఎఫ్పీ ప్యానెళ్ల వినియోగం తప్పనిసరి అన్నారు. ఎస్ఓలు, సీఆర్టీలు, పీజీటీలు, ఇతర సిబ్బంది సమన్వయంతో ఉండాలన్నారు. ఆకస్మిక తనిఖీల్లో లోటుపాట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీసీడీఓ మహేశ్వరి, సీఎంఓ గోపాలకృష్ణయ్య, ఏపీఓ నారాయణస్వామి పాల్గొన్నారు.
కేజీబీవీ ఎస్ఓల సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాదరావు