అనంతపురం: మహిళాభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ‘ఉన్నతి– మహిళా శక్తి’ పథకాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. మహిళా లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుపేద మహిళలకు ఆటోలను వడ్డీలేని రుణాలతో అందిస్తున్నామన్నారు. ఆటోకి బీమా చేయించాలన్నారు. నిర్ణీత వాయిదాల్లో అప్పు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, యాంకర్ పర్సన్ మంజుల, ఏపీడీ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మరికొంతమందికి ఉపాధి చూపిస్తా
ఇంద్రమ్మ సంఘంలో సభ్యురాలిగా ఉన్నా. రోజూ పొలాల్లో కూలీ పనులకు వెళ్లేదాన్ని. ‘ఉన్నతి– మహిళా శక్తి’ పథకం కింద పేరు నమోదు చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఆటో అందజేశారు. మా గ్రామంలో పొలం పనులకు వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. వారిని తీసుకెళ్లి, తీసుకురావడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నా. గ్రామంలో మరింత మంది మహిళలకు ఉపాధి కలిగేలా చూస్తా.
– కావేరి, వెంకటాపురం గ్రామం,
బుక్కరాయసముద్రం మండలం
సీఎం జగన్కు కృతజ్ఞతలు
నా భర్త అద్దె ఆటో నడుపుతుండేవారు. నేను అనంతపురం ఓల్డ్టౌన్లో కిరాణా షాపులో రోజువారీ కూలీ పనిచేసేదాన్ని. వచ్చే డబ్బు సరిపోయేది కాదు. పిల్లల్ని విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో సొంతంగా ఆటో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నా. గోదావరి మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో రూ.3 లక్షల వడ్డీలేని రుణంతో ఆటోను ప్రభుత్వం అందజేసింది. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. – పల్లవి, తోపుదుర్తి,
ఆత్మకూరు మండలం