చిలమత్తూరు: మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేసింది. రోజూవారీ రాత పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పరీక్షలో సదరు విద్యార్థిని కాపీ కొట్టిందని ఒకేషనల్ ఉపాధ్యాయురాలు ప్రమీలకు సహ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను నోట్బుక్కులు ఆఫీస్ రూంలో పెట్టి రావాలని ఉపాధ్యాయురాలు ఆదేశించారు. ఈ అంశాన్ని అవమానకరంగా భావించిన ఆమె నేరుగా పై అంతస్తులో ఉన్న బాత్రూంలోకి వెళ్లి విషపూరిత ద్రావకం తాగింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆమెను స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్స్లో తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఎస్ఓ రెహనా మాట్లాడుతూ.. చాలా సున్నిత మనస్తత్వం కలిగిన సదరు విద్యార్థి కాపీ కొట్టిందని తెలిసినా ఎవరూ ఏమీ అనలేదన్నారు. పాఠశాలలో అందరూ స్నేహభావంతోనే మెలుగుతారని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పురుషోత్తమరెడ్డి కేజీబీవీ ఎస్ఓకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.
చిలమత్తూరు కేజీబీవీలో ఘటన