అనంతపురం కార్పొరేషన్: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ హిరియల్ నదీంఅహ్మద్ పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎంతో మంది మైనార్టీ జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. మహానేత తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న జిల్లా కేంద్రంలో పైలట్ ప్రాజెక్ట్గా ముస్లిం మైనార్టీల విద్యార్థులు, పేద విద్యార్థులకు అడ్వాన్స్ కంప్యూటర్ కోర్సుల్లో (పైథాన్, వెబ్ టెక్నాలజీస్, డీఓప్స్, ఏడబ్ల్యూఎస్) మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నదీం తెలిపారు. ఈ నెల 21న రఘువీరా కాంప్లెక్స్లో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 36 సెంటర్లు, లైబ్రరీలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
20న మెహఫిల్– ఏ గజల్:
ఉర్దూ భాషను విస్తృతం చేయడంలో భాగంగా ఈ నెల 20 జెడ్పీ సమీపంలో మెహఫిల్ –ఏ– గజల్ కార్యక్రమాన్ని (ఉర్దూ సంగీత కార్యక్రమం) నిర్వహిస్తున్నట్లు నదీం తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సూఫీ నిజామీ బ్రదర్స్ ఫైసల్ అలీ ఖాద్రీ ఖవ్వాల్, హంసర్ హయత్, మజహార్ నిజామీ సోదర బృందం పాటలు పాడనున్నట్లు తెలిపారు. 21న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్టింగ్ ఉంటుందన్నారు. అనంతరం మెహఫిల్ ఏ గజల్ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మైనార్టీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మునీర, స్టేట్ ఫైనార్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్బేగ్, నాయకులు తబ్రేజ్, షకీల్, యూనస్, మహమ్మద్బాషా, అబీద, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
హిరియల్ నదీంఅహ్మద్