అనంతపురం అర్బన్: భూ వివాదాలు... భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’’ పథకం కింద జిల్లాలో రీ–సర్వే కార్యక్రమం వడివడిగా సాగుతోంది. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 31 మండలాల పరిధిలోని 503 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇప్పటికే రెండు విడతల్లో 83 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం మూడో విడత కింద 115 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయ్యింది.
93 గ్రామాల్లో హద్దు రాళ్లు..
మూడో విడత కింద 115 గ్రామాల్లో 3,55,359.06 ఎకరాలు రీ– సర్వే చేశారు. ఇందుకు సంబంధించి ఫైనల్ ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) పూర్తి చేశారు. అన్ని గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) వచ్చాయి. ఈ గ్రామాల్లో ‘13 నోటిఫికేషన్’ జారీ చేశారు. అన్ని గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 1,17,027 ఎల్పీఎం (ల్యాండ్ పార్సల్ మ్యాప్స్– భూ కమతం పటాలు) సిద్ధం చేశారు. సర్వే పూర్తి చేసి 115 గ్రామాల్లో ఇప్పటి వరకు 93 గ్రామాల్లో హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామాల్లో త్వరలో పూర్తి చేయనున్నారు.
రైతులకు సదవకాశం..
జాయింట్ ఎల్పీఎంల విషయంలో రైతులకు ప్రభుత్వం సదవకాశం కల్పించింది. మొదటి, రెండవ విడతల్లో సర్వే చేసిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంలను విభజించుకునేందుకు వీలు కల్పించింది. రుసుం లేకుండా జాయింట్ ఎల్పీఎంను విభజించుకునేందుకు (స్ప్లిట్) ఒక ఏడాది గడువు ఇచ్చింది.