అంతా బాగున్నా అసత్యాల సేద్యమే | Sakshi
Sakshi News home page

అంతా బాగున్నా అసత్యాల సేద్యమే

Published Wed, Nov 16 2022 6:30 AM

Agriculture Department Special Commissioner Harikiran On Eenadu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో చుక్కనీరు చూడని పెన్నాతో సహా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఏటా సగటున అదనంగా 14 లక్షల టన్నుల దిగుబడులు మూడేళ్లుగా వస్తున్నాయంటే ఏ స్థాయిలో పంటలు సాగవుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో కూడా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదవుతోందని ఓ వైపు ముందస్తు అంచనాలు చెబుతుంటే సాగు విస్తీర్ణం తగ్గడానికి వర్షాభావ పరిస్థితులే కారణమంటూ ‘పొడిగట్టిన సేద్యం’ శీర్షికన మంగళవారం ఈనాడులో ప్రచురించిన కథనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కొన్నిచోట్ల అధికం.. మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం 
ఖరీఫ్‌–2022 సీజన్‌లో 805.7మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 800.9మి.మీ. కురిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షపాతం 680 మి.మీ.లు కాగా, 712మి.మీ. నమోదైంది. అనంతపురం, సత్యసాయి, కాకినాడ, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.  

ఉద్యాన పంటలకు సర్కారు ప్రోత్సాహం 
ఇక ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 112.97 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 111.43 లక్షల ఎకరాలు. తగ్గిన విస్తీర్ణం కేవలం 1.54 లక్షల ఎకరాలు మాత్రమే. అదే వ్యవసాయ పంటల వరకు చూస్తే సాధారణ విస్తీర్ణం 85.32 లక్షల ఎకరాలు కాగా, 79.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఆ మేరకు తగ్గిన విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో ఉద్యానపంటల సాధారణ విస్తీర్ణం 27.64 లక్షల ఎకరాలు. కానీ, సాగైన విస్తీర్ణం 31.12 లక్షల ఎకరాలు.

దాదాపు 3.48 లక్షల ఎకరాలకుపైగా పెరిగింది. మిగిలిన విస్తీర్ణంలో పట్టు తదితర పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లోనూ ఉద్యాన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2019–20లో 90,844 ఎకరాలు, 2020–21లో 1,42,565 ఎకరాలు, 2021–22లో 1,51,742 ఎకరాల మేర కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. దిగుబడులు కూడా 288 లక్షల టన్నుల నుంచి 328 లక్షల టన్నులకు చేరాయి.  ఖరీఫ్‌–2021లో ఆçహార ధాన్యాల ఉత్పత్తి 160 లక్షల టన్నులుంటే, ఖరీఫ్‌–2022లో 186లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని ముందస్తు అంచనా వేశారు.  

డ్రైస్పెల్స్‌ పేరుతో ‘ఈనాడు’ కాకిలెక్కలు 
ఇక కనీసం 21రోజులపాటు వర్షపాతం నమోదు కాకపోవడాన్ని డ్రై స్పెల్‌ అంటారు. ఏటా సీజన్‌లో డ్రై స్పెల్స్‌ నమోదు కావడం సర్వసాధారణం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తప్ప డ్రై స్పెల్స్‌ వచ్చినంత మాత్రాన కరువు ఛాయలున్నట్లు కాదు. సీజన్‌లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, పంటలు దెబ్బతినే స్థాయిలో కనీసం 2–5 వారాల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు (డ్రై స్పెల్‌) కొనసాగితే ఆ ప్రభావం పంటల దిగుబడిపై చూపుతుంది. టీడీపీ హయాంలో కరువు మండలాలు ప్రకటించని ఏడాది లేదనే చెప్పాలి. కానీ, గత మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేవు. వాస్తవాలిలా ఉంటే.. డ్రై స్పెల్స్‌ వల్లే సాగు విస్తీర్ణం తగ్గిందంటూ కాకిలెక్కలతో రైతులను గందరగోళ పరిచేలా ‘ఈనాడు’ ఎప్పటిలాగే ఓ కథనాన్ని వండి వార్చింది. 

డ్రై స్పెల్స్‌ వల్ల నష్టం వాటిల్లలేదు
పొడి వాతావరణం (డ్రై స్పెల్‌) ఏర్పడినా ఏ విధమైన తేమ ఒత్తిడికి పంటలు గురికాలేదు. పంట నష్టం వాటిల్లలేదు. వివిధ కారణాలవల్ల తగ్గిన వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహంవల్ల ఖరీఫ్‌–2022 సీజన్‌లో 3.48 లక్షల ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లారు. రైతులను గందరగోళ పరిచేలా ఈనాడు కథనాలు ప్రచురిస్తోంది. ‘పొడిగట్టిన సేద్యం’ కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదు. 
– చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ 

Advertisement
Advertisement