‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్‌ | Sakshi
Sakshi News home page

‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్‌

Published Sun, Oct 29 2023 5:19 AM

All states should take Andhra Pradesh as an example says vishal kapoor - Sakshi

సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యా­నికి ఆంధ్రప్రదేశ్‌ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమి­టెడ్‌­(సీఈఎస్‌ఎల్‌) సీఈవో విశాల్‌ కపూర్‌ ప్రశంసలు కురిపించారు. విద్యుత్‌ వాహ­నాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌­(ఈఈఎస్‌ఎల్‌), సీఈ­ఎస్‌­ఎల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్‌ఎల్‌ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్ర­శేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు.

ఈ ఏడాది ద్వి­చక్ర, త్రిచక్ర విద్యుత్‌ వాహ­æనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్‌ కపూర్‌ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారా­లను, 474 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్‌ఎల్‌ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పా­రు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయ­న్నారు.

విద్యుత్‌ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్‌ కపూర్‌ ప్రశంసించారు. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగు­లకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావ­డం అభి­నందనీయమన్నారు.

ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్‌ వాహనా­లుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వాహనాల్లో సగం ఈవీలే ఉండా­లని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకో­వాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement