టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు

Published Fri, Aug 21 2020 8:28 AM

AP Department Of Education Exercise On Teachers Transfers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం (ఫైలు)ను పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇక బదిలీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున ముందుగా అందుకు సంబంధించిన కసరత్తును అధికారులు చేపట్టారు. ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మండలస్థాయి నుంచి వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. 

హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీవిరమణలతో అయ్యే ఖాళీల జాబితాలను పంపించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. 
అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపించాలని పేర్కొంది. సస్పెన్షన్లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోరాదని వివరించింది. 
మరోవైపు ఆయా జిల్లాల విద్యాధికారులు ఇందుకు అనుగుణంగా వివరాల సేకరణ చేపట్టారు. యుడైస్‌ కోడ్‌ ప్రామాణికంగా పాఠశాలల్లోని ఖాళీలల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా ఖాళీల సమాచారానికి కోడ్‌ జాగ్రత్తగా నమోదు చేయాలి. హెచ్‌ఆర్‌ఏను అనుసరించి నాలుగు కేటగిరీలుగా స్కూళ్లను చూపించాలి. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ స్కూళ్ల వివరాలు మాత్రమే నమోదు చేయాలి. 
సెప్టెంబర్‌ 1 నాటికి ఉండే ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. 
భాషా పండితుల (లాంగ్వేజ్‌ పండిట్‌) పోస్టులు స్కూల్‌ అసిస్టెంటు (లాంగ్వేజెస్‌)గా అప్‌గ్రేడ్‌ అయినందున వాటిని ఎల్పీగా పేర్కొనకూడదు. 
2015 నవంబర్‌ 18వ తేదీకన్నా ముందు తేదీల నుంచి ప్రస్తుత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, టీచర్ల వివరాలు 
    సమర్పించాలి.  
1970 సెప్టెంబర్‌ 1 తరువాత పుట్టిన పురుష ఉపాధ్యాయులు బాలికల హైస్కూళ్లలో పనిచేస్తుంటే వారి వివరాలు ఇవ్వాలి.  

Advertisement
Advertisement