Sakshi News home page

నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు: సీఎం జగన్‌

Published Fri, Feb 16 2024 1:13 PM

AP Govt Signed edX MOU: CM YS Jagan Speech - Sakshi

గుంటూరు, సాక్షి: మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. 

‘‘ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అనేది పాత నినాదం. కానీ.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం అని అన్నారాయన. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారాయన. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని అన్నారాయన. 

.అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు.మనం వేసిన ప్రతి అడుగు ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం.

ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్‌ సిటిజెన్స్‌ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు. 

అందుకనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం.

అక్కడితో మనం ఆగిపోలేదు. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. వాళ్లు మన ఎస్‌సీఈఆర్టీలో భాగమై.. ఈ ఏడాది టీచర్లకు సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెడతారు. ఈ ఏడాది టీచర్ల సామర్ధ్యం పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు వచ్చే ఏడాది ఒకటో తరగతి, ఆ తర్వాత రెండో తరగతి ఇలా.. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతాం.

6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్‌ చేస్తూ... ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్‌ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చాం. 

ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఉన్నతవిద్యలో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్‌ సిటిజెన్స్‌గా తయారవుతారు. ప్రపంచంతో పోటీపడతారు. ఉన్నతవిద్యారంగం మీద ఈ ఐదుసంవత్సరాల మీద పెట్టిన ధ్యాస ఇంతకముందు ఎవరికీ ఊహకు కూడా అందని విధంగా ధ్యాసపెట్టి అడుగులు వేయించగలిగాం. మొట్టమొదటిసారిగా పిల్లలు కచ్చితంగా చదవాలి, వారి చదువులకు పేదరికం అడ్డురాకూడని అడుగులు వేశాం. దీనికోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చాం. ప్రతి ఏటా విద్యాసంవత్సరం జూన్‌ –జూలైలోనూ, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. 

ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకువచ్చాం. దాదాపు 30శాతం కోర్సులు స్కిల్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్‌ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు తీసుకువచ్చాం. తొలిసారిగా మూడేళ్ల కోర్సులో కూడా ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిగా చేస్తున్నాం. మూడేళ్ల కోర్సుతో పాటు  ఇంకో ఏడాది హానర్స్‌డిగ్రీ ఇచ్చే విధంగా తీసుకువచ్చాం.

తొలిసారిగా 400 పైగా బైలింగువల్‌ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది.

2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్‌ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి.  ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశాం. 

అందులో భాగంగానే ఇవాళ వేస్తున్న ఇంకో గొప్ప అడుగు ఎడ్‌క్స్‌తో ఈ రోజు మనం చేస్తున్న ఒప్పందం. దాదాపుగా 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్‌ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్‌లైన్‌లో వాళ్లతో ఇంటరాక్ట్‌ అయి డౌట్స్‌ క్లారిఫికేషన్స్‌ జరుగుతాయి. ఫైనల్‌గా పరీక్షలు జరుగుతాయి. మన పిల్లలు ఆ పరీక్షలు పాసవుతారు. క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. 

మనదగ్గర యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా వాళ్ల దగ్గర నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజిమెంట్, సైబర్‌ ఫోరెన్సిక్, స్టాక్‌ ఎక్సేంజ్, వెల్త్‌ మేనేజిమెంట్, రిస్క్‌ మేనేజిమెంట్‌ వంటి వర్టికల్స్‌ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయి. మన దగ్గర ఇవేవీ కనిపించవు. ఇటువంటివి నేర్పించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం, రెండోది ఇటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం కూడా మరో కారణం. ఈ రెండింటిని కూడా బ్రిడ్జ్‌ చేస్తూ.. ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే... ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నాం. ఇది పెద్ద మార్పు.  దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్‌ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్‌, వెల్త్‌ మేనేజిమెంట్, ఫైథాన్‌ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయి. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయి. 

దాదాపుగా 12లక్షల మంది విద్యార్ధులకు 2వేలకు పైగా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన యూనివర్సిటీలలో మన పాఠ్యప్రణాళికలో భాగంగా అవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని మన పిల్లలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వీటిలో విద్యార్ధి తనకు కావాల్సిన వర్టికల్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సాంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికేట్లు ఉండడం వల్ల ఉద్యోగ సాధన మరింత సులభం అవుతుంది. గతంలో అన్ని యూనివర్సిటీల వీసీలకు ఇదే మాట చెప్పాను. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్‌మెంటెడ్‌ టెక్నాలజీ, 3డి లెర్నింగ్‌ వంటి వాటిని మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి  తేగలుగుతాం.

మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే.  నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. విద్యను ఏ స్ధాయిలో ప్రోత్సహిస్తున్నామంటే.. టాప్‌ –50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో టైమ్స్‌ రేటింగ్స్, క్యూ ఎస్‌ రేటింగ్స్‌లో ఉన్న  320 కాలేజీలలో సీటు వస్తే.. రూ.1.25 కోట్ల వరకు ప్రభుత్వమే ఫీజులు కట్టి చదవిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా వినియోగించుకుని ఇప్పటికే వినియోగించుకున్నారు.

అందరికీ ఆ రకంగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు,  ప్రతి  యూనివర్సిటీలలో ఆ యూనివర్సిటీలనే, ఆ సబ్జెక్టులనే తీసుకుని వచ్చే గొప్ప ప్రయత్నమే ఈ ఎడ్‌క్స్‌తో చేసుకుంటున్న ఒప్పందం. దీనివల్ల పెద్ద యూనివర్సిటీలలో సీట్లు రాకపోయినా.. ఆ కోర్సులు మన యూనివర్సిటీలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు. నాణ్యమైన విద్య మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తున్నాం.

ప్రతి వైస్‌ ఛాన్సలర్‌కి చెబుతున్నాను. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఆన్‌లైన్‌ కేపబులిటీని పెంచాలి. మన దగ్గర రిజిస్ట్రేషన్లు బాగా జరిగేలా చూడాలి. పద్మావతి యూనివర్సిటీలో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిస్ధాయిలో  వినియోగానికి చర్యలు తీసుకున్నారు.యూనివర్సిటీలో కంప్యూటర్‌ విజన్, మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు.  ఇది ప్రారంభం. ఇటువంటి చర్యలు ప్రతి యూనివర్సిటీ తీసుకోవాలి. టెక్నాలజీని మన పిల్లలకు తీసుకునిరావాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్యకు అందించగలుగుతాం. ఆ దిశగా వీసీలు మందడుగు వేయాలి. కార్యక్రమంలో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ ఎంఓయూ చేసుకుంటున్నాం’ అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Advertisement
Advertisement