విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’

6 May, 2021 03:50 IST|Sakshi
భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలు

ఉపాధి హామీ పథకంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మందికి పనులు 

పూర్తి స్థాయి కరోనా జాగ్రత్తలతో  పనుల కేటాయింపు

నెల రోజుల్లో 26.38 లక్షల కుటుంబాలకు ఉపాధి

సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా పరిస్థితులలోనూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు.. సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ. 751.29 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో 26.38 లక్షల కుటుంబాలకు సంబంధించి 40 లక్షల మంది ప్రయోజనం పొందినట్టు అధికారులు తెలిపారు. పని ప్రదేశాలలో కూలీలకు కరోనా భయాలు లేకుండా ఉపాధి పథకం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

► ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేకుండా ఒక్కో చోట గరిష్టంగా 30 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు.
► సాధ్యమైనంత వరకు కూలీ ఇంటికి సమీపంలోనే పనులు కల్పిస్తున్నారు. కూలీలు ఆటోల వంటి వాహనాల్లో కిక్కిరిసి వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచి వెళ్లే దూరంలోనే పనులు కల్పిస్తున్నారు. 
► ప్రతిరోజు పనుల ప్రారంభానికి ముందు కూలీలందరినీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోతేనే పనులకు అనుమతిస్తున్నారు. 
► పని ప్రదేశంలో కూలీలతో తప్పనిసరిగా మాస్క్‌లు ధరింపచేస్తున్నారు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు సబ్బులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది.  

మరిన్ని వార్తలు