‘పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారు’ | Sakshi
Sakshi News home page

‘పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారు’

Published Mon, Jan 22 2024 9:54 PM

Botsa Satyanarayana Comments On Anganwadi Workers - Sakshi

సాక్షి, అమరావతి: పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని ఆయన సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని తెలిపారు.జాయిన్‌ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నానని అన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని మరోసారి గుర్తుచేస్తున్నామని చెప్పారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని చెప్పారు. మీరు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపారు. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామని చెప్పారు. మిగిలిన డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని అన్నారు.రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్‌వాడీలను మరోసారి కోరుతున్నానని తెలిపారు.

అంగన్‌వాడీల అందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని చెప్పారు. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని, బాలింతలు, శిశువులకు ఇబ్బంది రాకుండా వెంటనే అంగన్‌వాడీల సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరుతున్నామని అన్నారు. వారి సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తి చేస్తున్నామని బొత్సా సత్యనారాయణ అన్నారు.

చదవండి: చంద్రబాబు పల్లకి మోసేందుకు  ముద్రగడ నో..!

Advertisement
Advertisement