చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్ | Sakshi
Sakshi News home page

చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్

Published Sat, Sep 9 2023 9:39 PM

Chandrababu Dangerous Person For Politics Ratnakar Says - Sakshi

సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అ‍న్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 

'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు.

'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు.

బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది:
'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా  చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు.  

రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: 
'2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు.

'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. 

ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు


 

Advertisement
Advertisement