చంద్రబాబు ఐటీ స్కామ్‌.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్‌! | Chandrababu IT Scam: Two Accused Escape To Foreign Countries - Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఐటీ స్కామ్‌.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్‌!

Published Fri, Sep 8 2023 2:33 PM

Chandrababu IT Scam Two Accuses Escape To Foreign Countries - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ నోటీసుల సమాచారం తెలుసుకుని ఇద్దరు నిందితులు విదేశాలకు పరారయ్యారు. ఈనెల 5న దుబాయ్‌కు మనోజ్‌ వాసుదేవ్‌ పారిపోయారు. సాయంత్రం 7.10 గంటలకు దుబాయ్‌కు వెళ్లిపోయారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస రావు కూడా హైదరాబాద్‌ నివాసంలో లేరు. శ్రీనివాసరావు ఈనెల 6న అమెరికాకు పరారయ్యారు. షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేష్‌ గుప్తా ఐటీ విచారణకు హాజరవుతానని తెలిపారు.

కాగా అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్‌ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలై..  ఐటీ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.  ఈ  నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది.

2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో గత వారం తనిఖీలు చేపట్టారు.

అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు కూడా ఉన్నాయి.



 

చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Advertisement
Advertisement