2022లో జమిలి ఎన్నికలు: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

కరోనా పోయిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతా

Published Sat, Oct 3 2020 6:41 AM

Chandrababu Said Jamili Elections Would Be Held In 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. చంద్రబాబు ఏమన్నారంటే..
కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తా.
పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. పార్టీలో కమిటీలన్నింటిని పూర్తిచేస్తున్నాం. యువతకు ప్రాధాన్యమిస్తున్నాం.  సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నాం.
పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పెద్దపీట వేస్తాం. నూతన నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే తెలంగాణ కేబినెట్‌ అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. 
టీడీపీ నాయకులను తీసుకుని మనపైనే విమర్శలు చేయిస్తున్నారు. 
ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలు 24 శాతం వడ్డీతో çఇప్పించే బాధ్యత నాది.
ఏడాదిన్నరపాటు నామీద అనేక ఆరోపణలు చేశారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్‌ నేడు చేతగాని పాలనతో చేతులెత్తేశారు.
రాజోలులో జనసేన నుంచి గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్‌ పెడితే కుట్ర పూరితంగా జగన్‌ బీసీల్లో చీలికలు తీసుకువచ్చారు. నేడు బహిరంగంగా కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వమని చెబుతున్నారు.
కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్‌ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, లా అండ్‌ అర్డర్‌ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. మేము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పింది. 
దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్‌ రాక్షస పాలనకు అద్దం పడుతుంది.
కరోనా నుంచి కాపాడుకోవడానికివెబ్‌సైట్‌ ప్రారంభిస్తున్నాం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement