పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్‌

Published Fri, Mar 1 2024 9:21 AM

CM Jagan Pamarru Public Meeting Live Updates: Jagananna Vidya Deevena Funds Release Today - Sakshi

Updates

03:04PM, Mar 1st, 2024
ముగిసిన సీఎం జగన్‌ పామర్రు పర్యటన

  • కృష్ణాజిల్లా పామర్రులో ముగిసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
  • పామర్రు నుంచి తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్‌
  • జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
  • అంతకు ముందు.. బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్‌

12:03PM, Mar 1st, 2024

ప్రసంగం అనంతరం సీఎం వైస్‌ జగన్‌... ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను బటన్‌ నొక్కి విడుదల చేశారు.

విద్యాదీవెన నిధులు  విడుదల సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య, దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం పామర్రు నుంచి చేస్తున్నాం. 
  • ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. 
  • పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చాం. 

  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు 9.45 లక్షల మంది పిల్లలకు.. మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోంది. 
  • ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి ఇప్పటికి మధ్య చిన్న తేడా చెబుతా. 
  • మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను చదివించాలి, వారు బాగుపడాలి, ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, అర్హత ప్రమాణాలను పెంచాం. ఇన్ కమ్ లిమిట్స్ పెంచాం. 
  • గతంలో లక్ష రూపాయలకు పరిమితమైన ఇన్ కమ్ లిమిట్ ను, ఎస్సీలకు 2 లక్షల దాకా పరిమితమై ఉండేది. 
  • మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షలకు పెంచి ఈరోజు 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. 

  • గతంలో మాదిరిగా ఇంతే కడతాం, ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి, మీ చావు మీరు చావడం అనే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాం. 
  • పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకూండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నాం. 
  • ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు ఫీజులు వేస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. 
  • విద్యాదీవెనే కాకుండా పిల్లలు ఇబ్బంది పడకూడదని, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పాపకూ, బాబుకూ తల్లిదండ్రులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా జరిపిస్తున్నాం. 
  • అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబ్స్ మెంట్ ను 9.45 లక్షల మందికి మేలు చేస్తూ నేరుగా బటన్ నొక్కి పిల్లల, తల్లుల జాయింట్ అకౌంటుకు ఏకంగా 708 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. 
  • 708 కోట్లతో కలుపుకొని 57 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం చెల్లించిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తీసుకుంటే.. ఏకంగా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ జగనన్న విద్యాదీవెన ద్వారా మాత్రమే రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు జమ చేయడం జరిగింది. 
  • జూలై నుంచి జూన్ దాకా ఉండే విద్యాసంవత్సరం మొదట్లో, చివర్లోనూ ప్రతి ఏప్రిల్ లో ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా చెల్లించిన మొత్తం మరో రూ.4275 కోట్లు.
  • ఈ ఏప్రిల్ లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1100 కోట్లు కలుపుకొంటే.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పెట్టిన డబ్బు ఏకంగా రూ.18 వేల కోట్లు.

  • ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పిల్లలకు మంచి జరగాలని ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. 
  • మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. 
  • ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు వివిధ పథకాల మీద 57 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే 73 వేల కోట్లు చేశాం. 
  • గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలని, కేవలం పథకాల మీద ఖర్చు చేసిన సొమ్ము ఈ 73 వేల కోట్లు.
  • ఇది పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్. 
  • పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగానూ, కలెక్టర్లుగానూ, డాక్టర్లుగానూ, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగానూ వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ మారాలని, భవిష్యత్ బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాం. 
  • ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులనూ, పిల్లలనూ ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తున్న ప్రతి తల్లిదండ్రినీ గమనించమని కోరుతున్నా. 
  • ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసింది, దాని వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ గమనించమని కోరుతున్నా. 

  • మీ పిల్లల వయసు ఈరోజు మూడు సంవత్సరాలు కావొచ్చు, 23 సంవత్సరాలలోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు జీవించాల్సిన జనరేషన్ లో ఉన్న వారు. 
  • ఏ విషయంలో అయినా కూడా వీళ్లందరూ పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. 
  • పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, దేశంతో కాదు, రేప్పొద్దున వీళ్లు ప్రపంచంతో పోటీ పడతారు. 
  • గత 30 సంవత్సరాలు తీసుకుంటే, అప్పటికి, ఇప్పటికి తీసుకుంటే వస్తువులు, సేవలు, టెక్నాలజీ అయినా ఎంతగా మారిపోయాయో, మారుతూ వస్తున్నాయో ఇవన్నీ కూడా మనమంతా చూస్తున్నాం. 
  • కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకొనే చదువులు కాదు.. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదని అనుకొనే చదువులు కాదు.. ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు. 
  • ఇవాళ తరం రేపు భవిష్యత్ లో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు మన పిల్లలకు అవసరం. 
  • ఈ నిజం, అవసరం తెలుసుకున్నా కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకొనేలా అడుగులు వేస్తూ వచ్చాం. 

  • ప్రాథమిక విద్యలో ప్రతి అడుగులోనూ మార్పులు తెచ్చాం. 
  • మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. 
  • మనం వేసే విత్తనం మరో 10-15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచిభవిష్యత్ లేకపోతే చెట్టు ఒరిగిపోతుంది. అలాంటిది కాకుండా పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి, భవిష్యత్లో అందరికన్నా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని అడుగులు వేస్తూ వచ్చాం. 
  • గవర్నమెంట్ బడులను మార్చాం. ఇంగ్లీషు మీడియంతో పాటు గవర్నమెంట్ బడుల్లో సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. 
  • ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి.. ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తోంది, ఈనాడు రామోజీ రావుతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తోంది. టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. 

  • గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం తప్పు. ఇంగ్లీషు మీడియం తేవాలని తపన పడటం తప్పు. ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. 
  • మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు.
  • వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. 
  • నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ గమనించాలి. 
  • పెత్తందార్లయిన వారికో ధర్మమట. పేదలైన మీకో ధర్మమట. 
  • వారి పిల్లలకు ఓ బడి అంట. మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట.
  • పెత్తందార్లుగా వారుండాలట. పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట. కార్మికులుగా మాత్రమే మనమట.
  • సామ్రాజ్యాలన్నీ వారివట. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట.
  • వారి పిల్లల చేతుల్లో ట్యాబులుండొచ్చు. స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులిస్తే మాత్రం పిల్లలు ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తారు. 
  • ఇవన్నీ ఎప్పటికీ మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనాలుగా మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.

  • ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి, మనకు మధ్య జరుగుతున్నది ఒక యుద్ధం. క్లాస్ వార్ జరుగుతోంది. 
  • పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం, డబ్బులున్న వారికి ఒక చదువులు, డబ్బుల్లేని వారికి మరో చదువులుగా జరుగుతున్న యుద్ధం.
  • మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం. 
  • సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, ఈ విప్లవానికి అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. 
  • అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. 
  • విదేశాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు సైతం ఆన్ లైన్ లో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి ఒక్కటీ విప్లవాత్మక మార్పు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. 

  • అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. 
  • అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 
  • 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చింది మీ అన్న పరిపాలనలోనే.
  • ఏకంగా 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఈ 57 నెలల కాలంలోనే. 
  • మొట్ట మొదటి సారిగా గవర్నమెంట్ బడుల పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలు చదువుతున్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిట్రసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే.

  • మొట్ట మొదటిసారిగా నాడునేడుతో స్కూళ్లన్నీ రూపురేఖలు మారుస్తూ, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్ పీ ప్యానెల్స్ తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • నాడునేడులో భాగంగా 45 వేల స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ప్రతి స్కూళ్లో తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • పిల్లలకు రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలుండాలని, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒకటిఉండాలని ఏర్పాట్లు చేస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 

  • ఐక్య రాజ్యసమితిలో మన పేద ఆడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన ఘట్టం పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతోందో ప్రపంచానికి చాటి చెప్పిందో చూశాం. 
  • పెద్ద చదువులే చదువుతున్న పిల్లలకు మొట్ట మొదటి సారిగా 100 శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. 
  • భోజన, వసతి ఖర్చులు కూడా భరిస్తున్న ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్ లో 330 కాలేజీల్లో సీటు మీరు తెచ్చుకోండి రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్ చేసి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావాలి, భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే. 

  • మొట్ట మొదటి సారిగా కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఈ 57 నెలల కాలంలోనే. 
  • కరిక్యులమ్ ను జాబ్ ఓరియెంటెండ్ గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ అన్నది తీసుకొచ్చింది ఇప్పుడే. 
  • మొదటిసారి మన కరిక్యులమ్ లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ను తీసుకొచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ అడుగులు వేయించింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. 
  • మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల దేశీయంగా, విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అక్కడ ఉన్నదేమిటి, ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి, అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్ లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. 

  • మొట్ట మొదటిసారిగా ఈరోజు మన చదువుల్లో కరిక్యులమ్ లో భాగంగా, మన సబ్జెక్ట్ వర్టికల్స్ లో భాగంగా ఎంఐటీ నుంచి ఏఐ, పెన్సిల్వెనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్ వర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ ఎన్ వైఐఎఫ్ నుంచి, రిస్క్ రిటర్న్ మేనేజ్ మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి, ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్  నుంచి, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి.. ఇలా దాదాపు 2 వేల కోర్సులు. 
  • ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులన్నీ ఆన్ లైన్ ద్వారా మన కరిక్యులమ్ లో భాగాలై చదువులు చెబుతూ పరీక్షలు పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చేట్టుగా మొట్ట మొదటి సారి అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే. 
  • ఇది ఎప్పుడూ, ఎవరూ ఊహించని మార్పు. 
  • ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మన పిల్లలందరికీ వాళ్ల చదువులు మారాలి. విద్యారంగంలో ప్రతి మార్పు వెనుక, చేస్తున్న వేల కోట్ల ఖర్చు వెనుక, మన పేద పిల్లలు ఇకనైనా పేదరికం సంకెళ్లను తెంచుకొనే స్థాయి రావాలి. 
  • ఈరోజు మనం వేసిన విత్తనం.. ఈ మార్పులన్నీ మరో 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఊహించుకోండి. 
  • ఈ విత్తనాలన్నీ అద్భుతమై ఫలితాలిచ్చే పరిస్థితి వస్తుంది. 
  • అంతర్జాతీయ స్థాయిలో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ ఎస్ సీ, ఎల్ బీఎస్ వంటి వర్సిటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్ గా బయటకు వచ్చి మరో 10-15 సంవత్సరాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికన్నా ముందుగా ఉంటారు. బతుకులు, తలరాతలు, భవిష్యత్తు మారుతుంది. 

  • ఈ రాష్ట్రంలోని పేద పిల్లాడికీ, ప్రతి పాపకూ తల్లిదండ్రులందరూ ఆలోచన చేయాలి
  • చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా పని చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? ఆయన చేసిన మంచేమిటి?
  • పేద పిల్లల భవిష్యత్ మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చంద్రబాబు చూపించాడా? ఆలోచన చేయాలి. 
  • గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు చేసిందేమిటి? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తుకురాదు. 
  • కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఆయన విద్యారంగంలో చేసిన చెడు మాత్రం చాలా చెప్పుకోవచ్చు.
  • గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించిన వ్యక్తి చంద్రబాబు.
  • అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీషు మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు. 
  • పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస పెట్టలేదు.
  • బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడునేడుతో స్కూళ్లు బాగుపరచాలన్నది లేదు.
  • అమ్మ ఒడి దిశగా అడుగులు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచన ఏరోజూ చేయలేదు. 
  • వసతి దీవెన కథ దేవుడెరుగు. 
  • అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నా. 
  • విదేశీ విద్యా దీవెన ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలు ఏదీ లేదు. 
  • ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇదీ అన్నది ఒక్కటంటే ఒక్కటీ లేదు. 

  • గ్రామంలో, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని చెప్పే పరిస్థితి లేదు. 
  • ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతోంది. 
  • మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం. 
  • వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్ తో కాదు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. 
  • జగన్ అనే ఒక్కడు పక్కకు పోతే పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు. విద్యారంగం గాలికిపోతుంది. 
  • ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులిస్తున్నది, వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది, రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు, అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి.
  • పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. 

  • అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు చెబుతారు. 
  • ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు.
  • మీ ఇంట్లో ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగిందని ఆలోచన చేయాలి. 
  • మీ ఇంట్లో మీ జగన్ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయండి, సైనికులుగా నిలబడండి. 
  • ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 
  • దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలిని కోరుకుంటున్నా

10:49AM, Mar 1st, 2024

► పామర్రు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
► సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నేతలు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్మాన్ నయీం అస్మి

►హెలీప్యాడ్ నుంచి సభా స్థలి వరకూ రోడ్‌షో
►సీఎంకు గ్రాండ్ వెల్‌కమ్ పలికిన పామర్రు ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
►సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై పూలవర్షం కురిపించిన పామర్రు ప్రజలు

10:29AM, Mar 1st, 2024

►పామర్రు బయల్దేరిన సీఎం జగన్‌

జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(శుక్రవారం) కృష్ణాజిల్లా పామర్రులో పర్యటించనున్నారు. 

►రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేయనున్న సీఎం జగన్‌ ప్రభుత్వం

►సీఎం జగన్‌ పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది.

►పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది.

►ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. 

Advertisement
Advertisement