AP Floods Latest Updates: CM YS Jagan Video Conference On Flood Situation In AP Update - Sakshi
Sakshi News home page

AP: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌

Published Mon, Jul 18 2022 9:44 AM

CM YS Jagan Video Conference On Flood Situation In AP Update - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇవే..
వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది. సీనియర్‌ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉంది. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి.

గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మీకు అందుబాటులో ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది  ఉద్యోగులు ఉన్నారు. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి నాణ్యమైన సేవలు అందించాలి. సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలి. 

ఇంతటి వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు. విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్‌ వంటివారు బురదజల్లుతున్నారు. వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. 

మీకు ఏం కావాలన్నా.. అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నిధుల సమస్య లేనే లేదు. మీరు ప్రోయాక్టివ్‌గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్‌ చేస్తే చాలు. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందించాలి.  బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించండి. మంచి ఆహారం.. తాగునీరు అందించండి. పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోండి. 

వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలి. గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారిని ఆస్పత్రులకు తరలించండి. వైద్యాధికారులు,స్పెషలిస్టులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి. క్లోరినేషన్‌ కొనసాగించాలి. అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి. 

పక్కజిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు తరలించేటప్పుడు సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టిసారించాలి. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్రోలింగ్‌ నిరంతరం కొనసాగాలి. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ మస్యను పరిష్కరించాలి. అనేక స్కూల్స్‌, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు  పరిశుభ్రంగా అందించాలి అని ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: వరద బాధితులకు అండగా నిలిచిన సర్కార్‌..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ 

Advertisement
Advertisement