సీఎంకు ఆశీస్సులు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

సీఎంకు ఆశీస్సులు ఇవ్వాలి

Published Tue, Dec 21 2021 4:51 AM

Dharmana Krishnadas Comments In CM YS Jagan Birthday Celebration - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94 శాతం అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అందరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్‌లోగల ఎంపీ కార్యాలయంలో సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్, రూరల్‌ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, రాజమహేంద్రవరం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య అతిథి, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేవుడిని కొలిచినప్పుడు ప్రతి ఆంధ్రుడూ అంబేడ్కర్‌ ఆశయాలతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గురించి కూడా వేడుకోవాలని కోరారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జన్మదిన వేడుకలను ఒక రోజు ముందుగానే వినూత్న రీతిలో జరిపారని అన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. చందన నాగేశ్వర్‌ ప్రసంగించారు. ఈ మంత్రులతో భారీ కేక్‌ కట్‌ చేయించారు. మొక్కలు నాటించారు.

మూడువేల మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. పింఛనును రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచినందుకు సీఎం జగన్‌ చిత్రపటానికి వృద్ధులు క్షీరాభిషేకం చేశారు. మహిళలు ప్లకార్డులతో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సంకిన భవానీప్రియ, తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మార్తి లక్ష్మి, పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, గిరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement