ఇసుక తవ్వకాలకూ ఈ–పర్మిట్‌ | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలకూ ఈ–పర్మిట్‌

Published Wed, Jun 9 2021 4:46 AM

E-permit for sand mining in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఇకపై ఈ పర్మిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింప చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్‌లోనే ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు.

ఇసుకకు ఈ పర్మిట్‌ కోసం మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తీసుకు వస్తున్నామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్‌లైన్‌లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏ రీచ్‌లో ఎంత మేరకు మైనింగ్‌ జరిగిందనేది కచ్చితంగా తెలుస్తుందని, మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని తెలిపారు.  
 

Advertisement
Advertisement