Fact Check: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఈనాడు అబద్ధపు రాతలు
Published
Tue, Nov 29 2022 11:38 AM
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఈనాడు అడ్డగోలుగా అబద్ధాలను వండివార్చడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడత పేచీ.. శీర్షికతో ఈనాడులో సోమవారం అబద్ధపు కథనం ప్రచురితమైంది. క్రమబద్దీకరించే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నింస్తోందని, ఇందుకోసం పలు నిబంధనలు పెట్టిందని అబద్ధాలను అచ్చోసింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసి ఇదే అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత దానిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు. క్రమబదీ్ధకరణకు ఎలాంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను సేకరించేందుకు ఒక ఫార్మాట్ ఇచ్చారు.
దానిప్రకారం వివరాలు సేకరించే పని జరుగుతోంది. కానీ ఈనాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం అభూత కల్పనలతో కథనం రాసింది. నిజానికి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఏమీ చేయలేదు. అప్పుడు వారు చేయలేనిదాన్ని, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డగోలుగా వక్రీకరణలకు దిగుతోంది.
దోచుకో పంచుకో తినుకో పద్ధతిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం, ఎల్లోమీడియా సిండికేట్గా మారి దొంగల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుతిన్నాయి. ఆ ముఠాకు నాయకత్వం వహించిన చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారు. దీంతో ఇప్పుడు దోచుకోవడానికీ, పంచుకోవడానికి వారికి ఏమీ లేదు. ఎప్పుడెప్పుడు తమ వాడిని ఆ సీటులో కూర్చోబెడదామా? మళ్లీ దోపిడీ మొదలుపెడదామా అని ఈ సిండికేట్ ఆత్రుతపడుతోంది. అందుకోసమే ప్రజలను ఏమార్చేందుకు అబద్ధాల కథనాలను అదేపనిగా ప్రచురిస్తోంది.