ప్రభుత్వం దృష్టికి విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టికి విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లు

Published Thu, Oct 22 2020 5:08 AM

Employees of electricity Demands to Government attention - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్‌ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ నెరవేర్చేందుకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గత నెల 28న యాజమాన్యానికి నోటీసు ఇచ్చి.. ఈ నెల 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

కచ్చితమైన హామీ ఇవ్వాలి
వర్షాలు, కోవిడ్‌–19 కారణంగా ఆందోళన విరమించాలన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ విజ్ఞప్తిపై విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నేత చంద్రశేఖర్‌ స్పందించారు. కనీసం వారం రోజుల ముందైనా ఈ విజ్ఞప్తి చేసి ఉంటే పునరాలోచించుకునే వీలుండేదన్నారు. ఆందోళనకు వెళ్తున్న సమయంలో ఎలా ఆపగలమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కచ్చితమైన హామీ ఇస్తే ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు.  

Advertisement
Advertisement