Flipkart CEO Kalyan Krishnamurthy Meet With CM YS Jagan at Tadepalli - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ భేటీ.. పెట్టుబడులపై విస్తృత చర్చ

Published Thu, Dec 16 2021 5:12 PM

Flipkart CEO Meet With CM YS Jagan at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి, కంపెనీ అత్యున్నతాధికారుల బృందం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. భేటీలోని ముఖ్యాంశాలు..

రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓకు వివరించారు. 

రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు.

చదవండి: ('ఆ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు')

ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం కోరారు.  

తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. 

రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఈ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావాలన్నారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.

మత్స్య ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్‌ ద్వారా రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని.. దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణన్‌ తెలిపారు.

సీఎం దార్శినికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు ఆయన అంకితభావంతో ఉన్నారన్నారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తితోపాటు, సీసీఏఓ రజనీష్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ పాల్గొన్నారు.

చదవండి: (జస్టిస్‌ చంద్రూ మాట్లాడిన వాటిలో ఒక్కటైనా తప్పని నిరూపించగలరా..?)

Advertisement
Advertisement