రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్కు తాను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గదర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గదర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్ విసురుతున్నారని చెప్పారు.
తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఫర్వాలేదన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాలయంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు. జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు.