సాక్షి, ఒంగోలు: మూడు కుటుంబాలకు జీవనాధారం ఆ గంగిరెద్దు. కుటుంబంలో ఒకరిగా ఉండే ఆ ఎద్దుకు ముద్దుగా వారు పెట్టుకున్న పేరు రాముడు. కాస్త గడ్డి వేస్తే తన కడుపు నింపుకొంటూ.. ఏడేళ్లుగా మూడు లంబాడీ కుటుంబాల ఆకలి తీరుస్తోంది. ఎవరు చెయ్యెత్తినా ఆగి విశ్వాసాన్ని ప్రదర్శించేది. అయితే ఏమైందోగానీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా ‘రాముడు’ మరణించాడు. దీంతో యజమాని వీరయ్యతో పాటు మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు.
33వ డివిజన్ కార్పొరేటర్ నియంతారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిచ్చే జంతువులు చనిపోయినపుడు మాత్రమే పరిహారం అందుతుందన్నారు.
అయితే ఎద్దు మరణంతో మూడు కుటుంబాలకు జీవనాధారం పోయిన నేపథ్యంలో పరిహారం వచ్చేందుకు కృషి చేస్తానని హాబీ ఇచ్చారు. గుండెపోటు వల్లే ఎద్దు మరణించిందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. గంగిరెద్దు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ సిబ్బందికి కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు.
చదవండి: (Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు)