Sakshi News home page

సందడిగా రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ 

Published Sat, Jan 27 2024 5:46 AM

At home program in Raj Bhavan - Sakshi

సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్‌ లో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, గుడియా ఠాకూర్‌ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి దంపతులకు గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సాదర స్వాగతం పలికారు.

అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్క్రీన్‌ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్‌ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement