బాబు కస్టడీకి మరో పిటిషన్‌: కరకట్ట రీఅలైన్‌మెంట్‌ స్కాం ఏంటీ? | Sakshi
Sakshi News home page

బాబు కస్టడీకి మరో పిటిషన్‌: కరకట్ట రీఅలైన్‌మెంట్‌ స్కాం ఏంటీ?

Published Thu, Sep 21 2023 8:29 PM

Inner Ring Road Case: What Is Karakatta Re Alignment Scam - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని  ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్‌లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో చంద్రబాబును A1  ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.

కరకట్ట ఇన్నర్‌ రింగ్‌ స్కాం అసలు కథ ఇదే?
టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది.

అసలేం జరిగింది? 
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్‌డీయే ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్‌ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది.  


 
అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది.  టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి. 


 ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు 
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్‌ కుటుంబానికి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. 
 
కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే 
చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. 

అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్‌ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్‌ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.  
 
హెరిటేజ్‌ భూముల లావాదేవీలు గోప్యం 
లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది.  చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది.  
 
లోకేశ్‌దీ కీలక పాత్రే... 
క్విడ్‌ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్‌ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్‌ డైరెక్టర్‌గా లోకేశ్‌ ఆ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్‌ ప్రోకో కింద హెరిటేజ్‌ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్‌ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది.  

కథ నడిపిన ఏ–2 నారాయణ  
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది.

ఈ కేసులో ఇప్పటికే  నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్‌డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్‌ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్‌ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది.

Advertisement
Advertisement