దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి

Published Thu, Jun 15 2023 11:35 AM

Minister Merugu Nagarjuna Praises Govt Over Sc Welfare Schemes Ap - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రావాలని సవాలు చేశారు. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు.

దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్‌ప్లాన్‌ ద్వారా 34.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయని, వాటిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలున్నాయని తెలిపారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు. టీడీపీ నేతలు దళితపల్లెకు వెళ్లి పేదగుడిసె తలుపుతట్టి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వారు చెబుతున్న మాటలను ప్రస్తావిస్తే చెప్పుతో కొడతారని ఆయన హెచ్చరించారు.

చదవండి: AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

Advertisement

తప్పక చదవండి

Advertisement