లోకేష్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని | Posani Krishna Murali Complained To The AP DGP That Nara Lokesh Had Threatened His Life - Sakshi
Sakshi News home page

లోకేష్‌తో ప్రాణహాని.. డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని

Published Wed, Aug 23 2023 1:30 PM

Posani krishna Murali Files Complaint Against Lokesh To AP DGP - Sakshi

సాక్షి, అమరావతి:  ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి పోసాని ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. 

అనంతరం మీడియాతో పోసాని మాట్లాడారు. లోకేష్‌తో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని పేర్కొన్నారు. డీజీపీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తరకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించానని.. అందుకే లోకేష్‌ ఇగో హర్ట్‌ అయ్యిందన్నారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష​ డ్రామాలు ఆడుతున్నారని పోసాని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిందే టీడీపీనే అని విమర్శించారు. 

‘టీడీపీలోకి నన్ను చేర్చుకోవాలని లోకేష్ ప్రయత్నించారు. ఆయన పీఏ చైతన్య ద్వారా కలిసే ప్రయత్నం చేశారు.  నేను చేరనని చెప్పడంతో నాపై కక్ష పెంచుకున్నాడు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్‌లో ఉన్నపుడు చంద్రబాబు చెప్పారు. కానీ కాంగ్రెస్ ఒడిపోగానే టీడీపీలో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారు.  తరువాత ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు.

చంద్రబాబుకు పదవి ఇష్టం లేకపోతే పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తానని ప్రమాణం చేయాలి. లోకేష్ నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుకు చెప్పే వెన్నుపోటు పొడిచారా?. నేను అగ్రెసివ్‌గా  మాట్లాడతా కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది నేనే. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడ దీస్తావ్? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు’ అని పోసాని లోకేష్‌పై మండిపడ్డారు.
చదవండి: కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్‌

Advertisement
Advertisement