సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది.
వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.