Skoch Group Chairman Sameer Kochhar Meet CM Jagan - Sakshi
Sakshi News home page

ఏపీలో అన్ని వర్గాల సమానాభివృద్ధి 

Published Thu, Jun 22 2023 6:19 PM

Skoch Group Chairman Sameer Kochhar Meet Cm Jagan - Sakshi

సాక్షి, అమరావతి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, సామాజిక, ఆరి్థక పరంగా మార్పులు కనిపిస్తున్నాయని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలుచేయాల్సిన అవసరముందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. సీఎం సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళా సాధికారికతకు వైఎస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, వరుసగా నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం అందించడమే కాక  వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నారని సమీర్‌ కొచ్చర్‌ వివరించారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2005లో ఆంధ్రప్రదేశ్‌ వచ్చానని, అప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో సామాజికంగా, ఆరి్థకంగా మార్పులను ఎలా తీసుకొచ్చారో అధ్యయనం చేసి డాక్యుమెంట్‌ రూపొందించానన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.

మహిళా సాధికారికతలో భాగంగా మహిళల జీవనోపాధి మెరుగుపరచడమే కాక.. వారి ఆరోగ్యానికి భరోసా కల్పించారని చెప్పారు. విద్యా రంగంపై పెద్దఎత్తున వ్యయం చేస్తున్నారని, తరగతి గదులను డిజిటలైజ్‌ చేస్తున్నారని, మూడో తరగతి నుంచే ప్రపంచస్థాయి సిలబస్‌తో టోఫెల్‌ పరీక్షలు నిర్వహించనున్నారని సమీర్‌ తెలిపారు. అలాగే, వైద్య రంగంలోనూ చాలా మార్పులు తీసుకొచ్చారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి పెద్దఎత్తున వ్యయంచేస్తున్నారని, ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలుచేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక.. వ్యవసాయ రంగంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను అందిస్తున్నారని, దేశంలో తొలిసారిగా ఏపీలోనే ఇలాంటి కేంద్రాలున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించాల్సిన అవసరముందని ఆయన  కొనియాడారు.  
 
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌.. 
ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని, సంపద అందరికీ సమానంగా అందితేనే సామాజికంగా ఆర్థికంగా మార్పులు వస్తాయని సమీర్‌ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎంతో జరిగిన భేటీలో స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తన‘ఇండియా 2047 హై ఇన్‌కమ్‌ విత్‌ ఈక్విటీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. సమీర్‌ కొచ్చర్‌ను సీఎం జగన్‌ సత్కరించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో స్కోచ్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ గురుశరణ్‌ ధంజల్, డైరెక్టర్‌ రోహణ్‌ కొచ్చర్‌ పాల్గొన్నారు.    
చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం

Advertisement
Advertisement