సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది.
బలంగా వైఎస్సార్సీపీ..
పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు.
అంతటా అయోమయం..
టీడీపీకి అలవాటైన డబుల్ గేమ్ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు.
ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు.
టిక్కెట్ ఇవ్వకుంటే..
టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు.
అయినప్పటికీ మామిడి.. లోకేష్ తదితరులకు టచ్లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు.
కలవరం..
ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది.